మీ అంతర్నాటకాలు మీరు చూసుకోండి! సమైక్య ఉద్యమాన్ని వెన్నుపోటు పొడవకండి!
బీజేపీ సీమాంధ్ర దళాలు మళ్ళీ ఢిల్లీకి దవుడు తీశాయి. రాష్ట్ర విభజన జరిగితే, సీమాంధ్రకు నష్టం జరగనీయ రాదని జాతీయ అధ్యక్షుణ్ణి కోరాయి. జీవోయం కు సీమాంధ్ర నివేదిక వేరుగా ఇస్తున్నాయి. పేరుగొప్ప పార్టీ 'రాష్ట్రం మొత్తానికి ఒకే నివేదిక' సమర్పించ లేకపోయింది. పార్టీలో తెలంగాణా పెత్తనం గుత్తాధిపత్యంగా నడుస్తోందని సీమాంధ్ర బీజేపీ నేతలు భావించవచ్చు! అయితే, అది వాళ్ళ అంతర్గత సమస్య.
రాష్ట్ర
విభజన గురించి బీజేపీ వైఖరి ఏమిటి అన్నదే మన ముందు ఉన్న ప్రశ్న! ఢిల్లీకి
పోయి ప్రత్యేక నివేదిక ఇచ్చినంత మాత్రాన సీమ - తీర ప్రాంత ప్రజానీకానికి
వీళ్ళు చేసే గొప్ప మేలేమీ లేదు! పైగా పనికిమాలిన జీవోయంను గుర్తించి, గౌరవించి - తగుదునమ్మా అని సీమాంధ్ర ప్రజల తరఫున దానికో నివేదిక ఇవ్వడమే తప్పు! నిజానికి "జీవోయం అంటే - విభజన మంత్రుల బృందం!!". కానీ, బీజేపీ దళాలు ఇప్పుడు ఒక స్పష్టమైన ప్రకటన చెయ్యాలి - తాము కోరిన అంశాలు బిల్లులో లేకపోతే, విభజనకు సమర్ధన వాపసు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తేవాలి!
ఈ కింది ప్రశ్నలకు సీమాంధ్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి:
1. కేంద్రం ప్రజాస్వామిక పద్ధతులలోనే రాష్ట్ర విభజన వ్యవహారం నడిపిస్తోందా?
2. రాష్ట్ర విభజన ఖచ్చితంగా రాజ్యాంగ ప్రక్రియ అనుసరించే జరుగుతోందా?
3. కేంద్ర కేబినేట్ 'విభజనకోసం ప్రతిపాదన' చేయడం ఏకపక్ష నిర్ణయం కాదా?
4. రాష్ట్ర విభజనకు పార్లమెంట్ ఆమోదించకముందే విభజన జరిగిపోయినట్లుగా ప్రభుత్వం ఆ దిశలో నిర్వహణా చర్యలు చేపట్టవచ్చా?
5. విభజనకు ముందే, ఆర్టికల్ 371-డి లో మార్పులు-చేర్పులు లేదా రద్దు అవసరమైతే, బీజేపీ రాజ్యాంగ సవరణకు బేషరతు మద్దతు ఇస్తుందా?
6. అప్పుడు ఆర్టికల్ 371-డి ఇచ్చిన హామీలు, గ్యారంటీలు కొనసాగుతాయా, కుదించబడతాయా? 371-డి రాష్ట్ర సమగ్రత రక్షణకు ఇచ్చిన హామీ అని బీజేపీ నేతలకు తెలుసా?
7. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రపతికి ప్రతిపాదన చేయవలసినది రాష్ట్ర అసెంబ్లీనా? కేంద్ర ప్రభుత్వమా?
8. విభజన బిల్లు పై అసెంబ్లీ నిరసన తెలిపితే, దానికి విలువ ఉండాలా, అక్కర లేదా?
పైన పేర్కొన్నవన్నీ - ప్రజాస్వామిక విలువలకు, రాజ్యాంగ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలు. ప్రజాస్వామ్య రక్షణకు చాంపియన్ తానే అని చెప్పుకునే బీజేపీ రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా అప్రజాస్వామికంగా, ఏక పక్ష సౌజన్యంతో, నిరంకుశ ధోరణిలో కొనసాగుతున్నప్పుడు - దానికి గుడ్డిగా బేషరతు మద్దతు ప్రకటించడం న్యాయమేనా? అది సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చెయ్యడం, సమైక్య వాదులను మోసం చెయ్యడంతో పాటు బీజేపీకే ప్రవచిత విలువలకే వ్యతిరేకం కాదా? విభజన వాదులు రాష్ట్ర విభజన కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటే, సీమాంధ్ర ప్రజలంతా ద్రోహులని విషం కక్కుతూంటే, అదే జేఎసీలలో బీజీపీ కూడా చేరి తందానా అంటుంటే, మీరంతా ఏం జేశారు? సుషమా స్వరాజ్ హైదరాబాద్ వచ్చి దశాబ్దాల సీమాంధ్రుల పీడననుండి తెలంగాణాకు స్వాతంత్ర్యం లభించిందని ఉపన్యాసాలిస్తుంటే, ప్రాంతీయ శతృత్వ భావాలను రెచ్చగొడుతుంటే, మీరెందుకు ఖండించ లేదు, చెవుల్లో సీసం పోసుకున్నారా?
మీకు చేతనైతే, తప్పుని తప్పని మోమాటమి లేకుండా, నిజాయితీగా చెప్పండి! ఆ ధైర్యం మీకు లేకపోతే, రాజకీయాలలోనుంచి తప్పుకొని మౌనంగా కాలక్షేపం చెయ్యండి. అంతేగానీ, శల్య సారధ్యం చెయ్యవద్దు! ప్రజల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతూ దేశానికి తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దు! ప్లీజ్!
No comments:
Post a Comment